అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ వారి విహార యాత్ర

అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారు ఒక రోజు ఆహ్లాదకర తీర్థయాత్రను అనంతగిరి, కోటిపల్లి రిజర్వాయర్ కు ఆదివారం 16 ఫిబ్రవరి నాడు నిర్వహించారు. వెళ్తూ వెళ్తూ దారిలో స్వామినారాయణ ఆలయం, మోయినాబాద్ వద్ద గాయిత్రిమాత ఆలయం దర్శించుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలో నున్న ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఉదయం ఏర్పాటు చేసిన రుచికరమైన అల్పాహారం భుజించి ప్రయాణమయ్యారు. తరువాత అనంతగిరికి తరలి వచ్చి శ్రీ అనంత పద్మనాభస్వామిని పూజించిన వారందరూ కలిసి, సమీపంలోని చాలా పురాతన మైన కోనేరు, శివాలయం సందర్శించారు. అందరూ కలిసి కోటిపల్లి రిజర్వాయర్ మరియు అందమైన అడవి అందాలను ఆస్వాదించారు. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక శాఖ వారు ఏర్పరచిన బోటు షికారు సమయం లేనందున ఉపయోగించుకోలేకపోయామన్నారు. తరువాత హరితా రిసార్ట్స్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛమైన శాఖాహార మధ్యాహ్న భోజనం ముగించారు. తదుపరి లక్కీడిప్ నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు. లంచ్ తర్వాత బస్సులో జోక్స్ లో పాల్గొనడానికి అందరికీ అవకాశం ఇచ్చి ఆనందించారు. ఆ తర్వాత శ్రీ రామలింగేశ్వర టెంపుల్, సూర్య భగవాన్ టెంపుల్ మరియు అడవిలో ముచికుంద నది పుట్టిన ప్రదేశం దర్శించారు. సాయంత్రం శ్రీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో మహామంగళ హారతికి హాజరై స్వామివారి దర్శనం చేసుకుని రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. బస్సు ప్రయాణంలో శ్రీమతి సత్యభావానీ క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంచారు. కార్యక్రమం చివరలో శ్రీమతి సత్యభావాణికి శాలువా కప్పి సన్మానించారు. హోం మేడ్ టేస్టీ స్నాక్స్ తో బస్సులో సమయాన్ని ఆనందంగా గడిపి అందరూ మధురానుభూతులతో హృహోన్ముఖులైనారు. ప్రతి సహభాగి కూడా టూర్ ని సంతోషంగా, ఆనందంగా ఆస్వాదించామని తెలుపుతూ అధ్యక్షుడు పి.వి.రమణయ్య తదితర నిర్వాహకులను ప్రశంసించారు. 



కామెంట్‌లు